క్రమశిక్షణతో చదువుకుని విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
బోర్లం గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
బాన్సువాడ, ఆగస్టు 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని గురుకుల పాఠశాల, కళాశాల (బాలికల)ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా బోధన, విద్యార్థినులకు అందుతున్న వసతులు, రికార్డులను వారు పరిశీలించారు.కళాశాలకు చేరుకున్న కలెక్టర్, ఎస్పీ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. వారి చదువులు, కళాశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
బ్లాక్బోర్డుపై రాసిన పాఠాలు, పాఠశాల రిపోర్టులు, విద్యార్థినులు సాధించిన ట్రోఫీలను పరిశీలించారు. అధ్యాపకులతో బోధనా పద్ధతులు, విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించారు.విద్యార్థినులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, మెనూ, పరిశుభ్రతపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థినులకు ప్రోత్సాహం అందించారు.
మౌలిక వసతులపై అధికారులకు సూచనలు
కళాశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్ మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీలో బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి, డీసీఓ, ఎంపీడీఓ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్,తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్,గిర్దావర్, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి అధికారులు పాల్గొన్నారు.






