రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి
- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి సాగు మినహా ప్రత్యామ్నాయ పంటల సాగు చేసి లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి మండలం గురజాల గ్రామంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాల పంపిణీ,విత్తన మేళా కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుత ఎల్ నినో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంట రకాన్ని ఎంచుకోవాలని, తక్కువ నీటి అవసరం గల పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని తెలిపారు.
ఈ క్రమంలో రైతులకు రాయితీ విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందని, రైతులు తమ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు పొందాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని మండల తహసిల్దార్ కృష్ణతో కలిసి సందర్శించి ప్రత్యేక సమగ్ర సవరణ, సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల తరపున నియమించబడిన బూత్ స్థాయి ఏజెంట్లు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందించని వారి నుండి సేకరించి బూత్ స్థాయి అధికారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ డీ ఏ రాజానరేందర్, వ్యవసాయ విస్తరణ అధికారి గౌసియా బేగం, మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్, బట్వాన్పల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.






