9 May, 2026 | 12:28 PM

స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

09-05-2026 11:33 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి):  జనగణన 2027 లో భాగంగా ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన మారథాన్ పాలిటెక్నిక్ కళాశాల వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ ఆలస్యమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని వివరాలు సేకరిస్తారని చెప్పారు.  ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సరైన సమాచారం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రజల వివరాలు పథకాల నమోదులో ఎక్కడ వినియోగించడం జరగదని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనగణన విజయవంతానికి మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి గిరిబాబు, సిపిఓ హరికృష్ణ, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.