పుర పారిశుద్ధ్య కార్మికులకు కళ్లద్దాలు పంపిణీ
* సొంత ఖర్చుతో అందజేసిన మాజీ కౌన్సిలర్
అచ్చంపేట: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు తాజా మాజీ కౌన్సిలర్, పబ్లిక్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కనోజు మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్) సొంత ఖర్చుతో కళ్లద్దాలు అందజేశారు. ఇటీవల అచ్చంపేట పబ్లిక్ క్లబ్లో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరంలో చూపు సమస్యలు ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
వైద్యుల సూచనల మేరకు అవసరమైన కళ్లద్దాలను కొనుగోలు చేసి గురువారం కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కాలం నుంచి కానోజు మనోహర్ ప్రసాద్ నిరుపేదలు, కార్మికులు, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవలో ఆయన చూపుతున్న చొరవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.






