ఎలాంటి లోపాలు, వివాదాలకు తావులేకుండా చూడండి
నేడు, రేపు 2కే రన్ నిర్వహించండి
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ జూన్ 16 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్ లెవల్ సూపర్వైజర్లు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని స్పష్టమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని అన్నారు.
నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా సవరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి పౌరుని ఓటు హక్కును పరిరక్షించేందుకు ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.ఎస్ ఐ ఆర్ అవగాహనకు సంబంధించి జూన్ 17న జిల్లాస్థాయిలో 2కే రన్, జూన్ 18న అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో 2కే రన్ నిర్వహించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హారి ప్రియా, జిల్లా స్థాయి మాస్టర్ ట్రేైనర్లు తదితరులు పాల్గొన్నారు.






