రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రానికి చెందిన ఎడ్మ లక్కీయాదవ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 26 వ తేదీన అచ్చంపేట పట్టణంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ పోటీలలో లక్కీ యాదవ్ 300 మీటర్ల పరుగపందెంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.
జిల్లా స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారిణి వచ్చే నెల 17 వ తేదీన మేడ్చల్ జిల్లా కొల్లూరులో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొననున్నట్లు తల్లిదండ్రులు ఎడ్మ శ్రీను యాదవ్,సరిత తెలిపారు. క్రీడాకారిణి ప్రస్తుతం అమ్రాబాద్ ప్రోగ్రెసివ్ పాఠశాలలో విద్య నభ్యసిస్తుందని అన్నారు. క్రీడాకారిణి గెలుపు పట్ల గ్రామస్తులు,కుటుంబ సభ్యులు,సీనియర్ క్రీడాకారులు,ప్రిన్సిపల్ అంబికా,ఉపాధ్యాయులు,స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.






