పరిమితికి మించి వైద్యం చేయొద్దు
అలంపూర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): ఆలంపూర్ చౌరస్తాలో శ్రీచక్ర హాస్పిటల్ సౌజన్యంతో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల తాలూకా స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కిడ్నీ వ్యాధి సంబంధిత వైద్యులు కేజీ గోవిందరెడ్డి హాజరై మాట్లాడారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తాహెర్ మాట్లాడుతూ, ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధికి మించి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స అనంతరం అవసరమైతే సంబంధిత స్పెషలిస్టులకు రోగులను రెఫర్ చేయాలని సూచించారు. యూనియన్ ఐక్యతతో పనిచేయాలని, సమావేశాలకు అందరూ సమయానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అమరవాయి సర్పంచ్ హుస్సేన్ ,పలువురు సీనియర్,జూనియర్ ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.






