1 August, 2026 | 2:37 AM

వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

01-08-2026 01:32 AM

క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, జూలై  31 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రధాన రోడ్డుపై గత కొన్ని రోజులుగా నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారుల కు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రి ఆవరణలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు అవసరమైన అంచనాలను వెంటనే సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భారీ వర్షాలతో పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువు వద్ద సంప్రదాయ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చెరువు పరిసరాలను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. ప్రజలు ప్రమాదవశాత్తు చెరువు వైపు వెళ్లకుండా తగిన బారికేడ్లు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని మున్సిపల్, పోలీసు అధికారులను ఆదేశించారు.

జీఆర్ కాలనీలో పర్యటించిన కలెక్టర్ అక్కడి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ: ప్రజల ప్రాణ భద్రతే జిల్లా యంత్రాంగం తొలి ప్రాధాన్యం అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నీటి నిల్వలు, చెరువులు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా అధికారుల సూచనలను పాటించి అప్రమత్తంగా ఉండాలి.

అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, స్థానిక కౌన్సిలర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ ఎన్. హన్మంతరావు నాయక్, టౌన్ ప్లానింగ్ అధికారి ఎ. వినీత్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సి.హెచ్. వేణుప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.