వైద్య వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు
* డాక్టర్ మంద జంగిరెడ్డి సేవలు చిరస్మరణీయం
* 32వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
* ఆసుపత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ
అచ్చంపేట: వైద్య వృత్తికి వన్నె తెచ్చి, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ మంద జంగిరెడ్డి సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. ఆయన 32వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ మంద జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్, మాజీ అధ్యక్షుడు, మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్ను శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ పిల్లి హరిచంద్ర, మాజీ ఎంపీపీ రామనాథం తదితరులు మాట్లాడుతూ.. డాక్టర్ మంద జంగిరెడ్డి పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో క్లబ్ అభివృద్ధితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలకు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం, సేవా దృక్పథం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
* వైద్య రంగంలో విశేష సేవలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్B తాలూకా అధ్యక్షుడిగా, మహబూబ్నగర్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా డాక్టర్ మంద జంగిరెడ్డి పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. ఉప్పునుంతల మండలంలో వైద్యాధికారిగా పనిచేసిన సమయంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని స్మరించుకున్నారు. వైద్య సేవలతో పాటు సామాజిక సేవలోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు.
* 32 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు
తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు, అటవీశాఖ ఉద్యోగి మంద శ్రీనివాస్రెడ్డి గత 32 ఏళ్లుగా డాక్టర్ మంద జంగిరెడ్డి పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగించడమే తండ్రికి అందించే నిజమైన నివాళి అని అన్నారు.
అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. లెనిటి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, మందుల దశరథం, కేతేపల్లి వెంకటేష్, కాకునూరి రవి, కానుగుల శివ, బెళ్లి ఆంజనేయులు, ఎల్.కృష్ణ, బొప్పి అశోక్నాథ్, రామనాథం, ఆకుల శ్రీను, జాఫర్, వైద్యులు రమాకాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






