స్మశానవాటిక, గుడి మాన్యం భూములు ఆక్రమిస్తున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు
నేరేడుచర్ల, జూన్ 18: జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో గల రామాపురంలో స్మశాన వాటిక స్థలం, కనకదుర్గమ్మ గుడి మాన్యం భూములు అక్రమణ జరుగుతున్నాయని గ్రామస్తులు తహసీల్దార్ ఎస్ సైదులు, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.నాగరాజుకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్మశాన వాటిక స్థలం, కనకదుర్గమ్మ గుడిమాన్యం భూములను గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతమల్ల సైదులు అక్రమంగా చెట్లను తొలగించి, భూమిని చదును చేసి ఆక్రమించుకున్నారని, అట్టి స్థలంలో ఎస్సీ కార్పోరేషన్ నిధుల నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణం అసంపూర్తిగా నిర్మించి, అట్టి నిధులను దుర్వినియోగం చేశారని ఇప్పుడు అట్టి కమ్యూనిటీ హాల్ ని కూడా నాదే అని చెప్పుచున్నారని గ్రామస్తులు తెలిపారు.
స్మశాన వాటిక, కనకదుర్గమ్మ గుడి మాన్యం భూమి సరిహద్దులు నిర్ణయించి దురాక్రమనకు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ సర్పంచ్ జంగిలి వెంకటేశ్వర్లు గ్రామస్తులు పోకబత్తిన శేఖర్, కొదమగుండ్ల నాగరాజు, మెండే జానయ్య, పాపయ్య, గంట సతీష్ తదితరులు ఉన్నారు.






