గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా
అశ్వాపురం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతను నివారించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డీజిల్ లేక రైతులు ట్రాక్టర్లు నడపలేక పంటల పనులు దెబ్బతింటున్నాయని, రవాణా వ్యవస్థ కూడా ప్రభావితమవుతోందని తెలిపారు.
గ్యాస్ కొరతతో మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతుంటే కొంతమంది దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ కోసం టూ వీలర్ దారులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రాక్టికల్గా సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. గతంలో యుద్ధం పేరుతో కొరత ఉందని చెప్పి, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కొనసాగుతుండటంపై ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సరఫరాను మెరుగుపరచి ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.






