12-02-2026 12:24:35 AM
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్
మెదక్, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి) :మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత అధికారులు రెండు రోజులపాటు విధుల నుండి విడుదల చేయాలని ఆదేశించారు.
గురువారం కౌంటింగ్ శిక్షణ తరగతి ఉదయం 10:30 గంటలకు మెదక్ వెస్లీ జూనియర్ కళాశాల, రామాయంపేట ఎంపీడీవో కార్యాలయం, నర్సాపూర్ బివి.ఆర్.ఐటి కళాశాల, తూప్రాన్ నోబెల్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించబడుతుందని తెలిపారు. నియమితులైన సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిక్షణలో పాల్గొనాలని సూచించారు.
అలాగే, కౌంటింగ్ విధులు ఈ నెల 13 వ తేదీన ఉదయం 7:00 గంటలకు అదే ప్రాంగణంలో ప్రారంభమవుతాయని, అందరూ తప్పనిసరిగా హాజరై తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరి సహకారం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.