20-02-2026 06:24:22 PM
నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతో కలిసి జిల్లా కలెక్టర్ కె. హరితను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 90 శాతం మంది రైతులు పత్తి సాగుపైనే ఆధారపడి ఉన్నారని, ఇంకా చాలామంది రైతులు పంట కోత దశలోనే ఉన్నారని తెలిపారు. తక్కువ గడువు కారణంగా రైతులు పత్తిని విక్రయించలేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కోరగా, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్యామ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.