గ్యాస్ కోసం వినియోగదారుల ఆందోళన
నెలలు గడుస్తున్న గ్యాస్ సప్లై అందజేస్తలేరని నిరసన
అబ్దుల్లాపూర్ మెట్, మే 5: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తూ సామాన్య ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపిస్తూ పెద్ద అంబర్ పేట్ లో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ఎదుట వినియోగదారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. నెలలు గడుస్తున్నా గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆరోపించారు.
గ్యాస్ అందజేయడంలో లక్ష్మీ గణపతి భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే వినియోగదారు లు విజయవాడ - హైదరాబాద్ సర్వీస్ రోడ్ మార్గంలో కొద్ది సేపు ఆందోళన చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందేలా చూస్తామని ఏజెన్సీ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు.






