29 August, 2026 | 6:21 PM

భద్రాచలంలో గోదావరి పుష్కర ఘాట్ల నిర్మాణాలు

29-08-2026 05:18 PM

గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రారంభమైన పుష్కర పనులు

భూమిపూజా కార్యక్రమంలో పాల్గొన్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్

నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రు. 46.65 కోట్లు నిధులతో ముడుదశల్లో ఘాట్ నిర్మాణాలు

భద్రాచలం,(విజయక్రాంతి): గోదావరి పుష్కర ఘట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ 49 కోట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. నిధులు మూడు మిడతలుగా మంజూరు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. భద్రాచలంలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు - 2027 కోసం ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణాలు శనివారం ప్రారంభమైయాయి. గోదావరి నది ఆయకట్టు పరివాహక ప్రాంతంలో పుష్కర పనుల కోసం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వేద పండితులు వారితో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలు 2027 కు మూడు విడతలుగా పనులను శ్రీకారం చుట్టామని తెలిపారు. అందులో భాగంగా తొలి విడుత  పనులు రు. 46.65 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందని పేర్కొన్నారు. రెండో విడత పనులు రు. 1.75 కోట్లు,మూడో విడత పనులు రు. 60 లక్షలు మొత్తం రు.49కోట్లతో ఈ పుష్కర ఘాట్ పనులు కొనసాగుతాయని తెలిపారు. వచ్చే ఈడాది మార్చ్ నెల లోపు ఈ పనులన్నీ పూర్తి కానున్నాయని వెల్లడించారు. మొదట భద్రాచలంలో  పుష్కర ఘాట్ పనులు, అనంతరం దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల, బూర్గంపాడు మండలంలో మోతే పట్టి నగర్ ప్రాంతాలలో ఘాట్ పనులు కొనసాగుతాయన్నారు.

చివరగా ములుగు జిల్లాలోని చిన్నరావిగూడెం, రామానుజావరం, రామచంద్రాపురం ప్రాంతాలలో పుష్కర ఘాట్ పనులు జరగనున్నాయని తెలిపారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో వచ్చే ఏడాది 2027 జూన్, జూలై నెలలో నిర్వహించే గోదావరి పుష్కరాల భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సరిహద్దు ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం ప్రాంతాలలో ఈ పుష్కర  ఘాట్ పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి మరమ్మత్తు పనులు రు. 351 కోట్లతో కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు జరుగుతున్న దేవాలయ మరమ్మత్తు పనులపై జిల్లా కలెక్టర్ అంకిత్, అధికారులు సమీక్షిస్తూ పనులు వేగవంతంగా చేపడుతునట్లు తెలిపారు. అదేవిధంగా గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తిచేసేలా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి అధికారులు భద్రాచలం కరకట్ట ప్రాంతంలో సర్వీస్ రోడ్డు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేలా ప్రణాళిక చేపట్టి చర్యలు చేపట్టాలన్నారు. 

పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం స్నానాల ఘాట్, మరుగుదొడ్లు తదితర వసతులన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. భద్రాచలం ప్రాంతాన్ని కంటికి రెప్పలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టెంపుల్ ఈ.వో దామోదర్ రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇరిగేషన్ సీ.ఈ శ్రీనివాస్ రెడ్డి,ఎస్.ఈ మహేశ్వర రావు, డీ.ఈ సబ్ డివిజన్ -1  భాగ్యరాజ్ రాధోడ్,ఈ.ఈ జానీ తదితరులు పాల్గొన్నారు.