29 August, 2026 | 7:47 PM

అంబేద్కర్ సంఘ భవనాలు పూర్తి చేస్తాం

29-08-2026 05:51 PM

అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

దట్నూర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి

గొల్లపల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో మిగిలిపోయిన అంబేద్కర్ సంఘ భవనాలు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రపంచం కొనియాడిన మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజల సంక్షేమం జరిగిందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనతో దేశంలో ఇందిరమ్మ వాడలు లేని గ్రామాలు లేవని మంత్రి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమ శాఖకు బాకీ ఉన్న రూ. 100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో సంక్షేమ హాస్టళ్లలో 10వ తరగతి విద్యార్థులకు 99% ఉత్తీర్ణత సాధించారని మంత్రి వివరించారు. 

ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా యువతకు ఉన్నత విద్య చదువుకోవడానికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్వారా నాణ్యమైన విద్యను అందించడానికి ధర్మపురి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ధర్మపురిలో డిగ్రీ కళాశాల మంజూరు చేయించామని మంత్రి వివరించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువకులు రాణించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. 

ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంది నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దట్నూరు గ్రామంలో బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెక్కం గంగారాం, గొల్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, జగిత్యాల జిల్లా మాజీ గంధ్రాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, అంబేద్కర్ సంఘ జిల్లా అధ్యక్షులు హనుమాడ్లు, గొల్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.