17 June, 2026 | 8:28 PM

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా పని చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి

17-06-2026 07:26 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పాల్గొని ప్రతి అర్హుడైన ఓటర్లు జాబితాలో కొనసాగుతున్నాడు లేదో పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ పై నియోజకవర్గ స్థాయి శిక్షణ సదస్సు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్ ఐ ఆర్ పై ప్రత్యేకంగా ముద్రించిన బుక్ లెట్ లు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు బిఎల్ఏలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని అన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రతి అర్హుడైన ఓటరు జాబితాలో కొనసాగుతున్నాడో లేదో పరిశీలించాలని సూచించారు.బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అదే సమయంలో బోగస్ ఓట్లను సృష్టించి ఎన్నికల్లో అనైతిక లబ్ధి పొందాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇటువంటి ప్రయత్నాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతర బలహీన వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) చురుకుగా పనిచేస్తూ స్థానిక కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులైన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయించి వారి ఓటు హక్కును కల్పించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.,తాను గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి ఒక సాధారణ సైనికుడిలా సేవలందిస్తున్నానని చెప్పారు. రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలు, ఒత్తిడులు, ప్రలోభాలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగానని తెలిపారు.నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆ కాలమంతా కాంగ్రెస్ కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని గుర్తు చేశారు. 

అదే స్ఫూర్తితో నేటి కార్యకర్తలు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఓటరు జాబితాల పరిశీలన అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన పరిధిలోని ప్రతి కుటుంబాన్ని సంప్రదించి ఎవరి ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని తెలిపారు.