రైతన్న ఉసురులో కాంగ్రెస్ ప్రభుత్వం
మాజీ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని, ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేస్తాం..
ఇప్పటికే నిధు లు సమకూర్చుకున్నాం అని సీఎం ప్రగల్భాలు పలికారని, ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతుబంధు ఊసే లేదని ఎద్దేవా చేశారు. క్యాబినెట్ మీటింగ్లోనూ దీనిపై ఉలుకు లేదు, పలుకు లేదని బుధవారం ఎక్స్ వేదికగా హరీశ్రావు విమర్శించారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్రెడ్డికి మూసీ సుందరీకరణకు వేల కోట్లు,
సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో వందల కోట్ల తో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని సీఎం కట్టుకుంటున్నారని, ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే రూ.9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే.. మీ ఏడో గ్యారెంటీ ‘ప్రజాస్వామిక పాలన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.




