తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!
- గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడని ప్రకటన
- తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి
- విజయ్ ను ఇబ్బంది పెడుతున్న చిన్న పార్టీలు
- గవర్నర్, కేంద్రంపై టీవీకే, కాంగ్రెస్ ఫైర్
చెన్నై: తమిళనాడులో సస్పెన్స్ పొలిటికల్ థ్రిల్లర్(Political thriller) కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. నిన్న సాయంత్రం టీవీకే అధినేత విజయ్(TVK Chief Vijay) ముచ్చటగా మూడోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కానీ, గవర్నర్ కార్యాలయం నుంచి ప్రకటన ఇంకా వెలువడలేదు. దీంతో విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly elections) విజయ్ టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. రెండు స్థానాల నుంచి విజయ్ గెలుపొందినందున టీవీకే బలం 107కు తగ్గింది.
కాంగ్రెస్(5), లెఫ్ట్ పార్టీలు(4) మద్దతుతో టీవీకే బలం 116కు చేరింది. వీసీకే(2) మద్దతిస్తే టీవీకే బలం 118కి చేరనుంది. వీసీకే(Viduthalai Chiruthaigal Katchi) టీవీకేకు మద్దతుపై ఇవాళ ప్రకటన చేయనుంది. టీవీకే(Tamilaga Vettri Kazhagam) కు నేడు వీసీకే మద్దతిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశముంది. టీవీకేకు నిన్న సాయంత్రం మద్దతిచ్చినట్లే ఇచ్చి ఐయూఎంఎల్(Indian Union Muslim League) తప్పుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వబోమని ఐయూఎంఎల్ ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ రెండు స్థానాల్లో విజయం సాధించింది.






