04-02-2026 07:16:34 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు.
ఈ విషయంలోఅధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.