11-02-2026 02:29:25 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కారణంగా పోలింగ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లపై సుదర్శన్ రెడ్డికి ఎస్ఈసీ రాణి కుముదని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీక్షిస్తున్నారా లేదా అని ఎస్ఈసీ రాణి కుముదినిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఈవో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... వెబ్ కాస్టింగ్ వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా వెంటనే తెలుస్తుందన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ద్వారా ఓటర్లను గుర్తించామని, ఇప్పటి వరకు 55 శాతం మ్యాపింగ్ పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎస్ఐఆర్ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసలు ఓట్లపై స్పష్టత ఉందని, రెండు రాష్ట్రాల వలస ఓటర్ల లెక్క తేలుతుందన్నారు. చనిపోయిన వారి ఓట్ల తొలగింపు కొంత ఆలస్యమయిందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.