బెంగాల్ పనివారిలో రాజకీయ చైతన్యం
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న కేంబ్రిడ్జ్ చరిత్రకారిణి ప్రొఫెసర్ సమీతా సేన్
పటాన్ చెరు: పశ్చిమ బెంగాల్ లోని గృహ కార్మికులలో రాజకీయ చైతన్యం అభివృద్ధి చెందుతోందని, గుర్తింపు, గౌరవం, న్యాయపరమైన వేతనాలు, చట్టపరమైన రక్షణ వంటి డిమాండ్లతో సమీకృతమవుతున్నట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని చరిత్ర ఉపన్యాసకురాలు సమీతా సేన్ పేర్కొన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ ఏషియన్ స్టడీస్ ఆధ్వర్యంలో పట్టణీకరణ, లింగం, శ్రమ (యూజీఎల్) విభాగం క్లస్టర్ ప్రారంభోపన్యాసాన్ని బుధవారం నిర్వహించింది.
‘ఉద్యమిస్తున్న పనిమనుషులు: పశ్చిమ బెంగాల్ లో గృహ కార్మికుల రాజకీయాలు’ అనే అంశంపై ఆమె ఆన్ లైన్ లో ఆతిథ్య ఉపన్యాసం చేశారు. పట్టణీకరణ, శ్రమ, లింగం వంటి అంశాలపై పనిచేస్తున్న స్కాలర్లను ఒకచోట చేర్చి, వివిధ రంగాల మధ్య అర్థవంతమైన సంభాషణలను ప్రోత్సహించే ఒక వేదికగా యూజీఎల్ డైలాగ్ ను రూపొందించారు. గృహాలలో పనిచేయడం అనేది లింగం, వర్గం, వలసలు, పట్టణీకరణ సమస్యలతో ముడిపడి ఉందని, ఇది అంతర్ విభాగ పరిశోధనకు ఒక ముఖ్యమైన రంగంగా నిలుస్తుందని డాక్టర్ సమీతా సేన్ అభిప్రాయపడ్డారు.
అస్థిరమైన ఉపాధి, సామాజిక భద్రత లేకపోవడం, పరిమిత చట్టపరమైన రక్షణలతో సహా గృహ కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రొఫెసర్ సేన్ చర్చించారు. గృహ కార్మికుల సంఘాలు, సమూహాలు పెరగడం వారి సమస్యలను ప్రజా చర్చలు, విధానపరమైన సంప్రదింపులలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని ఆమె పేర్కొన్నారు. కార్మికుల జీవన అనుభవాలను నమోదు చేయవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, సమకాలీన భారతదేశంలో కార్మిక, లింగ, పట్టణ పరివర్తనలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి స్కాలర్లు అంతర్ విషయ విధానాలను అవలంబించాలని ఆమె ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, స్కాలర్లు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. కార్మిక హక్కులు, మహిళా ఉద్యమాలు, పట్టణ భారతదేశంలో గృహ కార్మికుల మారుతున్న స్వభావంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని ఆంగ్ల, ఇతర భాషల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, యూజీఎల్ క్లస్టర్ సమన్వయకర్త డాక్టర్ దేబద్రిత చక్రవర్తి సమన్వయం చేశారు.
వక్త గురించి:
ప్రొఫెసర్ సమీతా సేన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంపీరియల్, నావల్ హిస్టరీకి సంబంధించిన వేర్ హార్మ్స్ వర్త్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె గతంలో డైమండ్ హార్బర్ మహిళా విశ్వవిద్యాలయానికి తొలి ఉప కులపతిగా పనిచేశారు. కలకత్తా, జాదవ్ పూర్ విశ్వవిద్యాలయాలలో బోధించారు. జాదవ్ పూర్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్ గా, అంతర్ విభాగం అధ్యయనం డీన్ గా కూడా సేవలందించారు. కామన్వెల్త్ చరిత్రలో ట్రెవర్ రీస్ బహుమతి గ్రహీత అయిన ఆమె, కార్మిక చరిత్ర, లింగ అధ్యయనాలు, వలస భారతదేశంలో విస్తృతంగా ప్రచురించారు. 1982 నుంచి ‘సచేతన’ అనే సంస్థ ద్వారా మహిళా ఉద్యమంలో కూడా చురుకైన సభ్యురాలిగా ఆమె ఉన్నారు.






