మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలి
హైదరాబాద్ మహానగరంలో నిత్యం రద్దీతో పోరాడుతున్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర రహదారి 1, కరీంనగర్ రోడ్డులోని శామీర్పేట్ వరకు అలాగే పారడైజ్ నుంచి మిలిటరీ డైరీ ఫారం వరకు రోడ్డు రవాణా రక్షణకు జాతీయ రహదారి నెంబర్ 44 అనుసంధానం చేయడానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూసేకరణ చేపట్టి పైవంతెనల ద్వారా రోడ్డు సౌకర్యాలు కల్పిండానికి చర్యలు చేపట్టడం చాలా బాగుంది. ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం.
ఇదేవిధంగా కరీంనగర్ రాష్ట్ర రహదారి 1 అలాగే, 44 జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న మిల్ట్రీ డైరీ ఫామ్ రోడ్డును కూడా విస్తృతస్థాయిలో విస్తరించుటకు రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని సేకరించడానికి కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ రోడ్డు నగరంలో నిత్యం రద్దీని పరిగణలోకి తీసుకుని దానిని నివారించుటకు అల్వాల్, తిరుమలగిరి, ఖానాజీగూడ, బోయినపల్లిలలో ఉన్న పలు కాలనీవాసులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ రోడ్డుపై అధిక భాగం రక్షణ శాఖ ఆధీనంలోని భూమి నిరుపయోగంగా ఉన్నది. ప్రజల సంక్షేమం దేశ అభి వృద్ధి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే భూ సేకరణ కావించి ఈ రోడ్డును భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలని నగరవాసులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతేక్య చొరవ తీసుకుని పెరుగుతున్న జనాభాను అనుగుణంగా తగని చర్యలు చేపడితే బాగుంటుంది.
దండంరాజు రాంచందర్రావు, పాత బోయినపల్లి






