తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, రాష్ట్ర అభివృద్ధిలో దీనికున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి ప్రపంచంలోని గొప్ప నగరాలను చూసిన మనలోని అదృష్టవంతులు ఎవరైనా సరే, మన దేశంలో కూడా అలాంటి ఆధునిక, సువ్యవస్థితమైన, అద్భుతంగా నిర్వహించబడే నగరం ఉంటే బాగుండేదని ఎప్పుడూ కోరుకునేవారని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
భారతీయులందరి ఉమ్మడి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అని, ఏదైనా నిర్మించాలంటే బలమైన పునాది, దానిని ముందుకు నడిపించే శక్తి అవసరం అన్నారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలో పెట్టే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) ప్రధాన కార్యాలయాన్ని మనం ఇవాళ ప్రారంభించి, అంకితం చేయబోతున్నామని ఆయన తెలిపారు.
ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరి అంకితభావం, కఠోర శ్రమ, పని పట్ల మక్కువ, ప్రతి చిన్న అంశంపై చూపిన శ్రద్ధ కారణంగానే, ఈ భవనం ఆరు నెలల కంటే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో పూర్తయిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని జరుపుకోవడంలో దీని ప్రాముఖ్యతను నెమరువేసుకోవడంలో భూమిపైనే అత్యుత్తమ నగరాలలో ఒకటిగా దీనిని తీర్చిదిద్దే దిశగా కృషి చేయడానికి అవసరమైన శక్తిని కూడగట్టుకోవడంలో నాతో కలిసి పాల్గొనండని ఆయన అన్నారు.






