11 May, 2026 | 2:16 AM

పకడ్బందీగా బాసర మాస్టర్ ప్లాన్ అమలు

11-05-2026 12:01 AM

దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

నిర్మల్ మే 10 ( విజయ క్రాంతి)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా లు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు గురించి పర్యటించారు.ముందుగా అధికారులు సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆ తర్వాత ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ తదితర ప్రాంతాలు తిరిగి చూశారు.

మాస్టర్ ప్లాన్ అమలు గురించి కీలక అంశాలు చర్చించారు.ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ, బాసర మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. బాసర క్షేత్రం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర ఆలయాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఆగమ శాస్త్రల నియమాల ప్రకారం, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా, అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

అమ్మవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, బాసర ఆలయ అభివృద్ధి కొరకు ఇటీవలి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని చెప్పారు. మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా ఆలయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భక్తులకు సకల సౌకర్యాలతో ఆలయ నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని చెప్పారు.

రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఎఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి తహసిల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.