11-02-2026 05:49:46 PM
- 19 వార్డు మాజీ కౌన్సిలర్ నిర్వాకం..
- బ్యాలెట్ పేపర్ స్టేటస్ కలకలం..
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఓ మాజీ కౌన్సిలర్ ఓటు వేసి బ్యాలెట్ పేపర్ ను స్టేటస్ లో పెట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలోని 19 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొమ్ముల జయ, తనయుడు మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ 32 పోలింగ్ బూత్ లో ఓటు ఓటు వేశారు. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ను ఫోటో తీసుకొని స్టేటస్ పెట్టుకున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ స్టేటస్ తెర పైకి రావడంతో ఎన్నికల అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు.
పోలింగ్ బూత్ లోకి ఆయన సెల్ఫోన్తో ఎలా వెళ్లడానీ చర్చ జరుగుతుంది. పోలింగ్ బూత్ అధికారులు, పోలీసుల తనిఖీల వైఫల్యం వల్లనే ఈ సంఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. ఈ ఘటనపై ఎన్నికల ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. అత్యుత్సాహంతో ఓ మాజీ కౌన్సిలర్ కొమ్ముల సురేష్ నిర్వాకంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేసిన బ్యాలెట్ పేపరు స్టేటస్ తో బయటికి రావడం, ఎన్నికల అధికారులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ ఆసక్తికరంగా మారింది.