11-02-2026 12:43:34 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఫిబ్రవరి 10 ( విజయక్రాంతి ) : ఫిబ్రవరి 11న వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న పోలింగ్ లో ఓటర్లు తమ ఓటు ను ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి నర్సింగాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని,
పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, కొత్తకోట మున్సిపాలిటీ కి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, అక్కడే ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఎన్నికల రోజు సాయంత్రం రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు సైతం పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు జి. లక్ష్మీ బాయి, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తహశీల్దార్లు, ఎంపీడీఓ లు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.