అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధులు నిర్వహించి తిరిగి వెళ్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలను శనివారం ఆయన స్వగ్రామమైన ఉల్పరలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పాల్గొని రాజు పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజు కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐలు ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీ, ఉప్పునుంతల ఎస్సై మహేష్తో పాటు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






