30 July, 2026 | 9:45 PM

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

30-07-2026 08:41 PM

వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ సంజయ్ జాజు

భూపాలపల్లి,(విజయ క్రాంతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. డీజీపీ సివి ఆనంద్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా పెంచాలని తెలిపారు.

జిల్లాలో చర్యలు: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులతో సమావేశమై రాబోయే రోజుల్లో వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, శిథిల భవనాలు, చెట్ల కింద ఉండరాదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 9030632608 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంత కుమారి, ఎస్ ఈ రమేష్, డా. మధుసూదన్, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.