సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నివారించాలి
మహేశ్వరం, ఆగస్టు 4, (విజయక్రాంతి): రావిరాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సంఘవ్యతిరేక కార్యకలాపాలు నివారించి, రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ మహేశ్వరం మండల కార్యదర్శి మునగని ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ మహేశ్వరం మండల అధ్యక్షుడు మునగని వంశీ, సీఐటీయూ మహేశ్వరం మండల కార్యదర్శి ఏర్పుల శేఖర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ ఆదిభట్ల సిఐ రమేష్ కు వినతిపత్రం అందజేశారు.
మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో మద్యం సేవించడం, మద్యం సీసాలు మరియు కిటికీలు పగులగొట్టడం, అసభ్యకరంగా గోడలపై రాయడం, మలవిసర్జన చేయడం, తరగతి గది తలుపులపై పాన్ ఉమ్మివేయడం, నీటి కుళాయిలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల పాఠశాల వాతావరణం కలుషితమై విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఈ సంఘటనలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, పాఠశాల వద్ద రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని సి ఐ ని కోరారు.






