ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం తప్పదు
బోధన్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. బుధవారం రోజున బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో విద్యార్థులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం సహ కోశాధికారి విజయ్, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






