ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ములకలపల్లి,(విజయక్రాంతి): ఎల్నినో కారణంగా లోటు వర్షపాతం నమోదు అవ్వడం వలన వరిసాగు తగ్గించి ఆ స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రైతులను కోరారు. సోమవారం ములకలపల్లి రైతు వేదికలో విత్తనమేళా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 29 వరకు ములకలపల్లి రైతు వేదికలలో విత్తనాలను విక్రయిచడం జరుగుతుందని కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న తదితర విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం ఎల్లినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు,బోర్లలో నీటిమట్టం తగ్గుతున్నాయని,చెరువులు పూర్తిస్థాయిలో నిండనందున రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలైన కంది, పెసర, మినుము,పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులకు కంది,మినుము విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు.






