అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
మహబూబాబాద్, జూలై 13 (విజయక్రాంతి): అక్రమ వలసదారుల గుర్తించి, అలా ఉన్న వారి పై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరును ఎస్ ఐ ఆర్ ద్వారా మ్యాపింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది, బిజెపి నేత తుంపిల శ్రీనివాస్ కోరారు. గ్రామాల్లో ’సర్’ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
కేసముద్రం పట్టణంలోని అమీనాపురం గ్రామం బూత్ నంబర్ 87కు సంబంధించిన ‘సర్’ దరఖాస్తు ఫారాలను భారతీయ జనతా పార్టీ, మహబూబాబాద్ జిల్లా ‘సర్’ కన్వీనర్, సీనియర్ న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్ తన ఇంటివద్ద సందర్శించిన ఆదివారం స్థానిక బూత్ లెవెల్ అధికారి బొజ్జ సుధాకర్ కు అందజేశారు.
ఈ సందర్భంగా తుంపిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం సజావుగా సాగేలా చూసేందుకు బీ ఎల్ వో లకు సహకరించాలని ఓటర్లను కోరారు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా అనేక బూత్లలో ఇంకా ’సర్’ గణన ఫారాలు ఓటర్లకు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి, అర్హత గల నిజమైన ఓటర్లను గుర్తించి, నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఓటర్ల ఇబ్బందులను తొలగించడానికి గ్రామాల్లో ’సర్’ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.
జిల్లాలో పలుచోట్ల అక్రమ వలసదారులు ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై అధికారులు అలసత్వం వహించకుండా తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి ఓట్లు, డబుల్ ఓట్లు మరియు అక్రమ వలసదారుల ఓట్లను గుర్తించి, వాటిని వెంటనే తొలగించేలా చూడాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంచార్జ్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంలో ఈ ప్రక్రియ ఎంతో కీలకమని తుంపిల్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.






