2 July, 2026 | 3:48 AM

హైదరాబాద్‌లో ఏఐ ట్రాఫిక్ సిగ్నల్స్

02-07-2026 01:00 AM

అనలాగ్, మెగా సంస్థలతో ప్రభుత్వం డీల్

త్వరగా అందుబాటులోకి తేవాలి

కంపెనీల ప్రతినిధులకు 

సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి   

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనలాగ్, మెగా ఇంజినీరింగ్ సంస్థలకు సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఏఐకి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.

బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సీఎం రేవంత్‌రెడ్డితో అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్మన్, మెగా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ, హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

భవిష్యత్ తరాల అవసరాల కోసం మేధోపరమైన మౌలిక సదుపాయాలు, ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలపై తమ ఆలోచనలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. హైదరాబాద్ ్ర టాఫిక్ పైలట్ ప్రాజెక్టు అంశాన్ని  ప్రస్తావించారు. నగరంలో అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్స్ వినియోగం వల్ల ప్రయోజనాలను తెలియజేశారు.

సెన్సార్లు, రోబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఎలా తోడ్పుతుందన్న అంశాలను వివరించారు. ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా సిగ్నళ్ల వ్యవస్థ, నీటి లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ రూపకల్పనకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చించారు.  

సాంకేతికత విస్తరణకు కీలక అడుగు

రవాణా రంగాన్ని సరికొత్త సాంకేతికతతో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. యూఏఈకి చెందిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అనలాగ్, మెగా ఇంజినీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్రంలో అత్యాధునిక ప్రాజెక్టులను చేపట్టేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.

ఈ భాగస్వామ్యం ద్వారా మౌలిక సదుపాయాలు, రవాణా, పరిశ్రమలు, ప్రజా భద్రత, స్మార్ట్ నగరాలు, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాల్లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక పరిష్కారాలను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేయడంలో ఎంఈఐఎల్ సహకరించనుండగా, అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అనలాగ్ అందించనుంది. ఈ సందర్భంగా ఎంఈఐఎల్ ఎండీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిజికల్ ఇంటెలిజెన్స్‌ను భారత్‌కు తీసుకురావడంలో అనలాగ్‌తో కలిసి పనిచేయడం మైలురాయిగా అభివర్ణించారు.

అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మన్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత వేగంగా సాంకేతికంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ ఒకటని, ఇక్కడి ఇంజినీరింగ్ ప్రతిభ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక దృక్పథం ఫిజికల్ ఇంటెలిజెన్స్‌కు అనువైన వాతావరణం  కల్పిస్తున్నాయన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్  సమ్మిట్ సందర్భంగా ప్రారంభమైన చర్చలకు కొనసాగింపుగా ఈ భాగస్వామ్యం కుదిరిందన్నారు. దీని ద్వారా హైదరాబాద్, తెలంగాణ అధునాతన సాంకేతిక పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానాలుగా నిలుస్తాయని సంస్థలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఐఎల్ డైరెక్టర్లు పీవీ ప్రణవ్ రెడ్డి, మానస్‌రెడ్డి, అనలాగ్ సీఓఓ యెన్సీ స్మిత్ తదితరులు పాల్గొన్నారు.