21 April, 2026 | 7:11 AM

అకాల వర్షంతో అన్నదాత కన్నీరు

21-04-2026 02:49 AM

మక్కారాజ్‌పేట్‌లో 1500 ఎకరాల వరి పంట నష్టం

చేగుంట, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేట, చందాయిపేట్, కరణంపల్లి, గొల్లపల్లి, కన్యారం, రాంపూర్ గ్రామంలో అకాల వర్షం రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది.ఇప్పటికే కోతకు వచ్చిన వరి పంట ఒక్కసారిగా కురిసిన వడగళ్ల వర్షంతో తీవ్రంగా దెబ్బతింది.

ఒక్క మక్కారాజ్ పేట్ గ్రామంలో 1500 వందల ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే నేలపాలవడంతో రైతుల ఆవేదన వర్ణణాతీతం. సమాచారం అందుకున్న వెంటనే దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సంబంధిత అధికారులతో కలిసి నష్టపోయిన పొలాలను పరిశీలించారు.ఆయనతో పాటు చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షం వల్ల రైతులకు భారీ నష్టం జరిగిందని తెలిపారు.ఈ సమస్యను జిల్లా అధికారులతో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, బాధిత రైతులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చేగుంట ఎఎంసీ చైర్మన్ తాడేం వెంగళరావు, తోగుట ఎఎంసీ చైర్మన్ అమరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, నాయకులు పద్మారెడ్డి, శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్, చేగుంట ఎస్‌ఐ చైతన్య రెడ్డి, గ్రామ సర్పంచ్ రేఖ సురేష్ రెడ్డి,ఉపసర్పంచ్ మొగులయ్య, ఎఎంసీ డైరెక్టర్లు,మొహమ్మద్ ముజామిల్, ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్,గ్రామ రైతులు కొండల్ రెడ్డి, రాజారామ్, జింక శ్రీనివాస్, సండ్రుగు శ్రీకాంత్ పాల్గొన్నారు.