17-02-2026 12:32:45 AM
తిలకించిన భక్తజన సంద్రం
అలంపూర్ ఫిబ్రవరి 16: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వేడుక వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ కనుల పండువగా జరిగిం ది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవాన్ని జరిపించారు.
కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు ఆదివారం రాత్రి ఆకాశ ద్వీప ప్రజ్వలనము కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మంగళవారం ఉదయం7:30 నుంచి నిత్య పూజ హోమాలు,9 గంటలకు నంది వాహన సేవ , 10 గంటలకు రుద్ర హోమం, సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించారు.
అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ,అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ చల్లా ఎమ్మెల్యే విజయుడు ప్రత్యేక పూజలు
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.