21-02-2026 12:00:00 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): గ్రామాల్లో మహిళల సామాజిక భద్రత, బాధ్యత కోసం కృషి చేయాలని రాష్ట్ర సెర్ఫ్ జెండర్ ప్రాజెక్టు డైరెక్టర్ జమున పిలుపునిచ్చారు. అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కుంటున్న నేపథ్యంలో మహిళల సామాజిక భద్రతకు కృషి చేయాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మండల సమాఖ్య పదాధికారులు, సోషల్ యాక్షన్ సభ్యులు, ఏపీఎంలు, సీఓలకు జెండర్ రిసోర్స్ సెంటర్ పై అవగాహన కల్పించారు.
మహిళల కోసం, వారి హక్కులు, రక్షణ కోసం సెర్ఫ్ ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులపై వారికి అండగా నిలిచి ఉండేందుకు మహిళా సమాఖ్యల ద్వారా వారికి తోడుగా ఉండేలా, గృహహింస, వరకట్న వేధింపులు,
ఈవ్ టీజింగ్, అత్యాచారాలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలు ఎదురైనప్పుడు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా, అలాంటి అన్యాయాలు జరగకుండా జెండర్ కమిటీ సభ్యులు స్పష్టమైన వివరాలు తెలుసుకొని గ్రామాల్లోని సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అవసరమైతే పోలీసు, న్యాయ సలహాల సహకారంతో బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ జెండర్ ప్రాజెక్టు అధికారి లింగయ్య, డి ఆర్ డి ఓ మధుసూదన రాజ్, అడిషనల్ డి ఆర్ డి ఓ. పీ.శ్రీనివాస్,డి పిఎం శ్రీకాంత్, ఏపీఎం సుభాష్ మహిళా సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు.