జైల్ భరోలో కార్మికుల నిరసన
నాగల్గిద్దలో ఆందోళనకారుల అరెస్ట్..
అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: కొఠారి నర్సింలు
నాగల్గిద్ద, ఆగస్టు 10 (విజయక్రాంతి) : కార్మిక, కర్షకుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నాయని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, సీఐటీయూ మండల నాయకులు గణపతి ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరోలో భాగంగా నాగల్గిద్దలో నిరసన చేపట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికులకు వ్యతిరేకమన్నారు. గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని నర్సింలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిర్మల, సంగీత, సవిత, సురేఖ, జ్యోతి, వేణి, విద్యావతి, రుక్మిణి, తుకారం, సాయి, దాస్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.






