రైతు శ్రేయస్సే లక్ష్యంగా గడప గడపకు నరసింహ
- నాచారం నరసింహక్షేత్రంలో మృత్తిక సేకరణ
గజ్వేల్: రైతు బాగుండాలనే సంకల్పంతో, రైతే దేశానికి వెన్నెముక అనే సందేశాన్ని విస్తరింపజేస్తూ భద్రాచలం గో గోవింద కల్పవృక్ష నరసింహ శాలగ్రామ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమాన్ డా. కృష్ణ చైతన్య స్వామి చేపట్టిన ‘గడప గడపకు నరసింహం’ యాత్ర భక్తి, సేవా భావాలతో కొనసాగుతోంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న భూవరాహ యజ్ఞం కోసం తెలంగాణలోని ప్రసిద్ధ నరసింహ స్వామి క్షేత్రాలను సందర్శిస్తూ మృత్తిక సేకరణ చేపట్టడం విశేషం.
ఈ క్రమంలో గురువారం నాడు నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని స్వామివారు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాచాగిరి క్షేత్ర ప్రాంగణంలో యజ్ఞార్థం మృత్తికను భక్తిశ్రద్ధలతో సేకరించారు. స్వామివారి యాత్రకు ఆలయ అధికారులు, భక్తులు ఘన స్వాగతం పలుకగా, రైతు శ్రేయస్సు కోసం జరుగుతున్న ఈ యజ్ఞానికి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేయడం అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రంగాచారి, సిబ్బంది సుధాకర్, అర్చకులు పాల్గొన్నారు.






