ఆ మున్సిపాలిటీలో పార్టీల ప్రణాళికలు ఫలించేనా..!
- అందరి చూపు జడ్చర్ల మున్సిపాలిటీ పైనే
- త్వరలో ఎన్నికలు ఉండొచ్చంటున్న పార్టీలు
- ఇప్పటినుంచి అట్టడుగు నుంచి ప్రక్షాళన చేస్తున్న బీఆర్ఎస్
- జడ్చర్ల జనం చూపు బీఆర్ఎస్ వైపా... అధికార పార్టీ వైపా
- మున్సిపాలిటీ కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్
- కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటామంటూ ప్రచారం
జడ్చర్ల, జూన్ 19 : ఎన్నికలు సమీపిస్తున్న అంటే చాలు అధికార పార్టీ హామీలు.. ప్రతిపక్ష పార్టీల భరోసాలు ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి అని చెప్పడం లో ఇందులో ఎలాంటి సందేహం ఉండదు. గత నెల 7వ తేదీన జడ్చర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ల పదవి కాలం ముగియడంతో ఈ ఎన్నికలు నవంబర్లో జరిగే అవకాశం ఉందంటూ ఇప్పటికే జడ్చర్ల పట్టణమంతా ప్రచారం ఒపందుకుంది.
ఇప్పటినుంచి కౌన్సిలర్గా వార్డులలో తాము బరిలో ఉన్నాము అంటే తామే బరిలో ఉన్నాము తమకు మద్దతు తెలపండి అంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. రిజర్వేషన్ల ప్రకారం కూడా కొన్ని వార్డులలో మీకు వస్తే మాకు వస్తే మీకు అనేలా చర్చలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగిన రెండున్నర సంవత్సరాల పరిపాలనలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదని ఒక వైపు ప్రజలు చెబుతున్న మాట.
మరోవైపు మాత్రం అభివృద్ధి అంటే కాంగ్రెస్ పరిపాలన జరిగింది గతంలో ఎప్పుడు జరగలేదంటూ కూడా కొందరు నేతలు వాదిస్తున్నారు. కాగా టిఆర్ఎస్ పార్టీ మరో అడుగు ముందుకేసి సామాన్య కార్యకర్తలను సైతం పూర్తిస్థాయిలో సముచిత గౌరవం ఇస్తూ వారి ఎదుగుదలకు అండదండగా ఉంటామంటూ భరోసానిస్తూ వస్తుంది.
కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల మున్సిపాలిటీలో కొత్తగా చేపట్టిన పని ఏదైనా ఉంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తప్ప మరొకటి ఆశించిన మేరకు జరగడం లేదని తెలుస్తుంది. ప్రణాళికలు ఎవరికి వారు వేసుకున్న గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి జడ్చర్ల మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మరింత గట్టిగా తమ తమ ప్రయత్నాలను చేసి మున్సిపాలిటీ కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి.
బలంగా మారుతున్న బీఆర్ఎస్..
అధికార కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను జనం లోపల ఎత్తిచూపుతూ మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ శుభకార్యాలతో పాటు అనారోగ్యం గురైన వారిని పరామర్శిస్తూ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటూ వస్తున్నా భరోసానిస్తూ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ తరుణంలో ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ఐక్యత మరింత వేగంగా తీసుకువస్తూ భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయని బిఆర్ఎస్ భావిస్తుందని తెలుస్తుంది.
బలమైన నేతలే లక్ష్యంగా అధికార పార్టీ...
బలమైన నేతల కోసం అధికార పార్టీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తుంది. అధికారం పెట్టుకొని మున్సిపాలిటీ కైవసం చేసుకోకపోతే విమర్శలు వెల్లువెత్తే అవకాశాలు ఉంటాయని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల మనసులు గెలిచి విజయం సాధించే దిశగా అడుగులు వేసినప్పటికీ జనానికి గడిచిన రెండున్నర సంవత్సరాల తో పాటు భవిష్యత్తులో చేయబోయే పనులు ఏంటో మరింత బలంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని జనం చెబుతున్న మాట.
బరిలో ఆ పార్టీలు బలంగా....
అధికారం కాంగ్రెస్ పార్టీతోపాటు బిఆర్ఎస్, బిజెపి ఇతర పార్టీలు సైతం తమ తమ అభ్యర్థులను బరిలో నిలిపించేందుకు ఇప్పటినుంచి అభ్యర్థుల వేట ప్రారంభించాయి. ఎవరికివారు పెద్ద నేతలను కలిసి తమకు టికెట్లు ఖాయం చేయాలని ఒత్తిడి తెచ్చేలా తమ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో 28 వార్డులకు జరగనున్న ఈ ఎన్నికలు భవిష్యత్తు ఎన్నికలకు ఎంతో కీలకంగా ఉండే అవకాశం ఉందని జడ్చర్ల వాసులు పేర్కొంటూడ్రు. ఏ పార్టీ ప్రణాళికల వైపు జనం ముగ్గు చూపుతారు వేచి చూడాలి.






