చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చిన రైతులు ఆందోళనకు గురికావద్దని, రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. గంగాధర మండలం మధురానగర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల తీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జిపిఎస్ సిస్టంతో ధాన్యం కొనుగోలు వారం రోజులు ఆలస్యం అయినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ తూకం వేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, నిబంధన మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలను పంపించాలని కలెక్టర్ ను కోరారు. కొనుగోలు చేసిన ధాన్యం తీసుకోకుండా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేముల భాస్కర్, పడాల రాజన్న, తూం రాజు, వేముల అంజి, సాగి అజయ్ రావు, మంత్రి మహేందర్, దాతు అంజి తదితరులు పాల్గొన్నారు.






