ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): బహుజన విప్లవోద్యమ రాష్ట్ర నాయకుడు,తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మండారి ప్రభాకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ కోరారు.మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం ప్రభాకర్ 7వ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రభాకర్ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి దోపిడీ,పీడనలు లేని సమాజంకై పోరాడుతూ అమరుడైన ప్రభాకర్ త్యాగం మరువలేనిదన్నారు.దేశంలో కులాన్ని రూపుమాపాలని,కులరహిత సమాజం కావాలని ఆదర్శ వివాహం చేసుకున్న త్యాగధనుడు ప్రభాకర్ అన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి అక్రమ అరెస్టులు,జైలు జీవితాన్ని గడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు పోరాడిన మలిదశ తెలంగాణ నాయకుడైన ప్రభాకర్ ప్రజల మదిలో ఎప్పుడు సజీవంగానే ఉంటాడన్నారు.






