ఇజ్రాయెల్లో సురక్షితంగా ఉన్నాం
విజయక్రాంతితో తెలంగాణ ప్రవాసీలు
మేడ్చల్, మార్చి 4 (విజయక్రాంతి): ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రవాసుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ నుంచి లక్షలాది మంది గల్ఫ్, ఇజ్రాయిల్ తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. తమ వారి క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రవాసులు విజయక్రాంతితో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయిల్లో ఉన్న తెలంగాణ వారందరూ సురక్షితంగా ఉన్నారని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన బొమ్మకంటి మహేష్గౌడ్ తెలిపారు.
క్షిపణి దాడి జరిగే అవకాశం ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రభుత్వం సైరన్ మోగించి అప్రమత్తం చేస్తుందని, దీంతో తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఇక్కడ క్షిపణుల దాడిని ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానని అన్నారు. క్షిపణులను ఇజ్రాయెల్ మిలటరీ అడ్డుకుంటుందని, వందలో ఒకటి మాత్రమే పడుతో ందన్నారు. ఇక్కడ ప్రతిఇంటికి బంకర్ ఉంద ని, సైరన్ మోగగానే అందులోకి వెళ్తామన్నారు. భూగర్భ రైల్వేస్టేషన్లు ఉంటాయని, అందులోకి కూడా వెళ్తామని మహేష్గౌడ్ తెలిపారు. తాము టెల్ అవివ్ నగరంలో ఉం టున్నామన్నారు. మేము క్షేమంగా, ఉన్నామని, తెలంగాణలో తమ కుటుంబాల వారు ఆందోళన చెందవద్దని చెప్పారు.




