2 April, 2026 | 4:41 AM

నేడు గ్రామ సభలు

02-04-2026 12:42 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో భాగంగా నేడు గురువారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 482 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపల్ పరిధిలలో గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు.

ప్రజా పాలన ప్రజల భాగస్వామ్యం పెంపు,ప్రభుత్వ పథకాల అమలు పై చర్చ, లబ్ధిదారుల అభిప్రాయాల సేకరణ, గ్రామ అభివృద్ధి అవసరాల గుర్తింపు, గ్రామ సమస్యల గుర్తింపు పరిష్కారం చర్యలపై చర్చ, పథకాల అమలులో పారదర్శకత పెంపు, లపై అందరిని భాగస్వామ్యులు చేస్తూ గ్రామసభ నిర్వహించి గ్రామ, వార్డు, పట్టణ సమగ్ర నివేదిక రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహాలక్ష్మి పథకం, 500 గ్యాస్ సిలిండర్, సెనరకం వడ్ల కొనుగోళ్లకు బోనస్ , చేయూత పెన్షన్లు, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కొత్త పథకాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకం, దివ్యాంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిటైడ్ మోటర్ రైజ్డ్ వాహనాల పంపిణీ, తదితర సమగ్ర నివేదిక చదివి వినిపించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలలో గ్రామసభల నిర్వహణ కోసం జిల్లా స్థాయి ప్రత్యేక అధికారులను నియమించి ఘనంగా కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ గ్రామ సభలలో పాల్గొని మీ భాగస్వామ్యం మీ హక్కు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పూర్తి సమాచారం తెలుసుకోగలరని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే జిల్లాలోని ప్రతి యూనిట్ల వారిగా లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా పథకాలను అమలుపరచడం కోసం జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ పాల్గొన్నారు.