ఒక్క విద్యార్థి కోసం 5 మంది ఉద్యోగులు..!
ఇంటర్ పరీక్ష సెంటర్లో అనూహ్య ఘటన.
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో శనివారం అనూహ్య పరిస్థితి చోటుచేసుకుంది. పదమూడవ రోజు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో కేటాయించిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉండగా, ఆ విద్యార్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు.
అయితే పరీక్షా నిబంధనల ప్రకారం కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్, పోలీస్ సిబ్బంది తదితరంగా మొత్తం ఐదుగురు సిబ్బందితో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సిబ్బంది అధికారులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు ఆ విద్యార్థి కూడా పరీక్షకు రాకపోవడంతో కేంద్రంలో సిబ్బంది ఖాళీగా విధులు నిర్వహించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాత్రం పరీక్షా నియమావళి ప్రకారం కేంద్రంలో అవసరమైన సిబ్బందిని తప్పనిసరిగా నియమించాల్సి వచ్చిందని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. వొకేషనల్ విభాగంలో 1,370 మంది విద్యార్థులకు గానూ 1,258 మంది హాజరయ్యారు.




