లక్డికాపూల్లో ట్రక్కు బోల్తా.. తప్పిన భారీ ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని లక్డీకాపూల్ వద్ద బుధవారం ఉదయం సరుకులతో వెళ్తున్న ఒక ట్రక్కు అదుపుతప్పి బోల్తా(Truck overturned) పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. పైపుల లోడుతో మెహదీపట్నం నుండి సైఫాబాద్ వైపు వెళ్తున్న ట్రక్కు సిగ్నల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని, అతను వెంటనే వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో, వాహనాల రద్దీ తక్కువగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు, క్రేన్ బృందం సహాయంతో ట్రక్కును రోడ్డు పక్కకు తరలించారు. ట్రాఫిక్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, ఎటువంటి అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




