పదో తరగతి ఫలితాల్లో త్రివేణి పాఠశాల విద్యార్థుల ప్రభంజనం
కొత్తగూడెం,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన తెలంగాణ పదో తరగతి (ఎస్ఎస్సి ) ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని త్రివేణి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి ర్యాంకులతో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థిని బి. అక్షయ శివాని 592 మార్కులు సాధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పి. అక్షయ్ మరియు కె. వర్షిత 586 మార్కులతో జిల్లాలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '90 రోజుల అభివృద్ధి ప్రణాళిక' (90 డేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ) కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, మరియు సి.పి.ఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పాల్గొని విద్యార్థులను సాదరంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరియు మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి కొత్తగూడెం పేరును నిలబెట్టిన విద్యార్థులను ప్రశంసించారు. విద్యార్థులను ఇంతటి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన పాఠశాల యాజమాన్యాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు.






