భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన
మున్సిపల్, హైడ్రా అధికారులతో కలిసి సందర్శించిన తుంగతుర్తి రవి
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి పీర్జాదిగూడ డివిజన్లలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించినప్పుడు నీరు నిల్వకుండా ఉండేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను పరిశీలించడానికి మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది సంయుక్తంగా పర్యటించారు. ఈసందర్భంగా వరంగల్ రహదారితో పాటు మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో గతంలో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించి, నీటి పారుదల పరిస్థితులను పరిశీలించారు. తుంగతుర్తి రవి అధికారులకు ఆయా ముంపు ప్రాంతాలను చూపించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
వర్షాకాలంలో వరద నీరు వేగంగా వెళ్లిపోయేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అడ్డంకులను తొలగించడం, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అలాగే ఈ వరదలకు శాశ్వత పరిష్కారంగా ఎస్ ఎన్ డి పి ప్రాజెక్టును నిర్మించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే వరదలకు చెక్ పెట్టొచని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి, భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడతామని తెలిపారు. నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.






