ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): మే 20న జరగనున్న దేశవ్యాప్త మెడికల్ దుకాణాల బంద్ సందర్భంగా జిల్లాలో ప్రజలకు మందుల లభ్యతలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ విశ్వంత్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్ పట్టణ కేంద్రాల్లో కనీసం మూడు మెడికల్ దుకాణాల చొప్పున బంద్ రోజున కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని జీవన్ ధారా జనరిక్ మెడికల్ షాపులు యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. మెడ్ప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ చైన్లు కూడా సేవలు కొనసాగిస్తాయన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రజలు 8333818147 నంబర్ ద్వారా జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని సూచించారు.






