డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గేది లేదు
- జంతర్ మంతర్లో మా గళం వినిపించాం
- జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు అరుణ
జగిత్యాల, జూన్ 7 (విజయక్రాంతి): మా 11 డిమాండ్ల సాధనే లక్ష్యమని, మా పోరాటం ఆగదని ఢిల్లీ ర్యాలీలో జగిత్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు క్యారంగుల అరుణ అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన నాల్గవ తరగతి ఉద్యోగుల గ్రాండ్ ప్రొటెస్ట్ ర్యాలీ చారిత్రాత్మకమని, 11 డిమాండ్ల సాధనలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ర్యాలీ అనంతరం అరుణ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వేలాది మంది ’డి’గ్రూప్ ఉద్యోగులు జంతర్ మంతర్ను హోరెత్తించి,మా ఆవేదనను కేంద్రానికి వినిపించామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 11 అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం ఆగదని ఆమె పేర్కొన్నారు. మే 22న బ్లాక్ బ్యాడ్జ్ నిరసనతో మొదలైన మా పోరాటం, ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీతో మరింత ఉధృతమైందన్నారు.
అసోసియేషన్ కేంద్ర సంఘం అధ్యక్షులు లూనావత్ దాస్య, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్ నాయకత్వంలో ఐక్యంగా పోరాడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇది మాత్రమేనని,డిమాండ్లు నెరవేరే వరకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అరుణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షులు లూనావత్ దాస్య, అసోసియేట్ అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హాసన్, సిటీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు, కార్యదర్శి అతిక్ పాషా,జగిత్యాల జిల్లా నుండి భాగ్య, తదితరులు పాల్గొన్నారు.






